Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

— జిల్లా కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్ఓ ఇలా త్రిపాఠి

District Collector Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ:వరంగల్ , ఖమ్మం, నల్గొండ ఉపా ధ్యాయ ఎంఎల్ సి ఎన్నికలు ప్రశాం తంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు .గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన తర్వాత జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, సెయింట్ అల్పాన్సస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అంతేకాక పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు,పోలింగ్ నమోదు, తదితర విషయాలను పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వచ్చే 12 జిల్లాల పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.

కలెక్టర్ కార్యాలయంలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని సాంకేతికంగా పర్యవేక్షించడం జరిగిందని, సాంకేతికత వల్ల ఇది చాలా సులభం అయిందని తెలిపారు. తనతో పాటు, అదనపు కలెక్టర్ ,ఏ ఆర్ ఓ, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, వారి ఏ ఆర్ ఓ లు ఇతర బృందాలు పూర్తిగా సహకారం అందించి సమన్వయంతో పని చేయడం జరిగిందని తెలిపారు. 12 జిల్లాల పరిధిలో ఎం ఎల్ సి ఎన్నికలు జరగడం తమకు సవాల్ గా ఉన్నప్పటికీ అందరి సహకారంతో ఎన్నికలు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల. లెక్కింపు కు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావివద్ద ఉన్న గోదాములో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ,స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎస్కార్ట్ ఏర్పాటు ,బందోబస్తును ఏర్పాటు చేశామని ,మార్చి 3 న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుందని ఆమె తెలిపారు.

వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 16.78% ఓట్లు నమోదు కాగా ,మధ్యాహ్నం 12 గంటలకు 48.68% ,2 గంటలకు 76.33% పోలింగ్ ముగిసే 4 గంటల సమయానికి 93.55% ఓట్లు నమోదయ్యాయి.కాగా నల్గొండ జిల్లా వరకు మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించినట్లయితే ఉదయం 10 గంటలకు 20.31%,మధ్యాహ్నం 12 గంటలకు 55.48% , మధ్యా హ్నం 2:00కు 80.61 శాతం, సాయంత్రం 4 గంటలకు 94.6% ఓట్లు పోలయ్యా యి.అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏ ఆర్ ఓ జె. శ్రీనివాస్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.