Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

— 7 పరీక్ష కేంద్రాలు..2087 మంది అభ్యర్థులు

–మే 4న మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు పరీక్ష

— సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1442 కు ఫోన్ చేయండి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Tripathi : ప్రజాదీవెన , నల్గొండ : ఈ నెల 4 న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ )అండర్ గ్రాడ్యుయేషన్ -2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ )అండర్ గ్రాడ్యుయేషన్ 2025 ప్రవేశ పరీక్ష పై శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నీట్ పరీక్షకు 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో 2087 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. 7 పరీక్ష కేంద్రాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 4 పరీక్ష కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా, ఎన్జీ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విద్యాలయాలలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నీటి పరీక్ష రాసే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే చూసుకోవాలని కోరారు. నీట్ – 2025 ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 11 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉన్నప్పటికీ బయోమెట్రిక్ అటెండెన్స్, తనిఖిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఉదయం 11 కే చేరుకోవాలని, మధ్యాహ్నం1.30 గంటలకు కచ్చితంగా పరీక్ష కేంద్రం గేట్లను మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలన్నింటిని తు.చ తప్పకుండా పాటించాలని, ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి , అలాగే 4 × 6 పోస్ట్ కార్డు సైజు కలర్ ఫోటోతో రావాలని తెలిపారు. గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ లేదా కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ఇతర ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పారు. ముఖ్యంగా ఆభరణాలు, భారీ దుస్తులు,బూట్లు ధరించి పరీక్ష కేంద్రం లోకి రాకూడదని, పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని,అలాగే జామెట్రిక్ బాక్సులు, మొబైల్ ఫోన్, బ్లూటూత్ , వాలెట్, రిస్ట్ వాచ్, కెమెరా, బెల్టు, గూగుల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, క్యాలిక్యులేటర్లు అనుమతించడం జరగదని తెలిపారు.

పెన్ను కూడా పరీక్ష కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. నీట్ ప్రవేశ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ఇదివరకే జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామని, అలాగే సీసీటీవీల ఏర్పాటు, పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాల మూసివేత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163వ సెక్షన్ విధింపు, తాగునీరు, మెడికల్ కిట్, ఓ ఆర్ ఎస్ పాకెట్ల ఏర్పాటు వంటి వాటిపై ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

నీట్ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అభ్యర్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1442 కు ఫోన్ చేయాలని ఆమె కోరారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ రాజకుమార్, నీట్ పరీక్ష నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, ఈ మీడియా సమావేశానికి హాజరయ్యారు.