–మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు
DSP Rajasekhara Raju : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద జనయేత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న డిఎస్పి రక్తదాతలకు అభినందనలు తెలిపి, మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు మేము సైతం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎనీమియా, తలసేమియా, సికిల్సెల్ వంటి సమస్యలు ఉన్నాయని, వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు లేవని అన్నారు. జిల్లాలో రక్త కొరత తీరాలంటే అపోహాలు విడనాడి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరంలో సుమారు 40 మంది రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పురుషులతో పాటు మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతు లైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రసంశా పత్రాలు అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ కు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఫౌండేషన్ కార్యాలయానికి చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు, ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, రూరల్ ఎస్సై లక్ష్మయ్య , నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాలల అధినేత ఆనుముల మధుసూదన్ రెడ్డి, జనయేత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్, డాక్టర్ బాలాజీ, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ దయాకర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు , జనయేత్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.