ప్రజాదీవెన, నల్గొండ : నామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి (37 ఇయర్స్), తెలకంటిగూడెం గ్రామం, కనగల్ (మండలం) నల్గొండ తీవ్రమైన గుండెపోటుతో హఠాత్ మరణం చెందటం బాధాకరం.ఇటువంటి సమయంలో కూడా వారి కుటుంబ సభ్యులైన తండ్రి లింగారెడ్డి, మాతృమూర్తి నాగమణి, భార్య గీతాంజలి, కుమారులు లౌకిక రెడ్డి, దేవ్ మౌఖిక్ రెడ్డి, తమ్ముడు హనుమంత్ రెడ్డి ను సంప్రదించగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణానంతర నేత్రదానానికి అంగీకరించినారు. వీరి అంగీకారంతో, నల్గొండ పట్టణ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరనాథ్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు సాయంత్రం 5 గంటల సమయంలో తేలకంటిగూడెం గ్రామానికి వెళ్లి నేత్రదానాన్ని సేకరించారు.
మరణం ఎంతో బాధాకరమైనదని ఇటువంటి సమయంలో కూడా కుటుంబ సభ్యులంతా ముందుకు వచ్చి నేత్రదానం చేయుట చాలా గొప్ప మనసును చాటుకోవడమేనని, అందుకే నేత్రదాత, భక్తకన్నప్ప గా కీర్తించబడతారని డాక్టర్ హరనాథ్ తెలిపారు. సేకరించిన నేత్రాలను (కార్నియా అను కంటి పొర లను) హైదరాబాదులోని ప్రముఖ అగర్వాల్ ఐ హాస్పిటల్ కు పంపించి, 72 గంటల లోగా కార్నియా అందత్వంతో బాధపడుతున్న, ఇద్దరు నుండి నలుగురు అందులకు, కెరటోప్లాస్టి అను శస్త్ర చికిత్స ద్వారా ఆపరేషన్ చేసి కంటిచూపును తెప్పించి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపవచ్చని, మరియు వారు కూడా మనలాగే ఈ అందమైన ప్రపంచాన్ని 15 రోజుల్లోగా చూస్తారని డాక్టర్ పుల్లారావు తెలిపారు.
మన చుట్టుపక్కల ప్రాంతాలలో గాని, కుటుంబ సభ్యుల్లో గాని, బంధుమిత్రులలో గాని ఎవరైనా స్వర్గస్తులయితే 6 నుండి 8 గంటల లోగా నేత్రదానాన్ని చేయించవచ్చని, ఒకవేళ పార్థీవ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచితే 12 గంటలు ఆపై కూడా నేత్రదానాన్ని చేయించవచ్చని ఈ నేత్రదానాన్ని కుటుంబ సంప్రదాయంగా పాటించాలని, నేత్రదానం చేయాలనుకునేవారు లేదా మరింత సమాచారం కొరకు తన నెంబర్ 9948143299 నందు సంప్రదించవలనని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల తెలిపారు.నేత్రదానం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ సెక్రటరీ నిమ్మల పిచ్చయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.