— అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్
FIR registered : ప్రజాదీవెన , నల్గొండ : సన్న బియ్యం పంపిణీ పై తప్పుడు ప్రచారం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకంపై ఇటీవల సోషల్ మీడియాలో గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం బదులుగా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ తప్పుడు వీడియోను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని గుర్తించి అతనిపై ఎఫ్ఆర్ నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకం చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని ఎవరైనా కించపరిచే ప్రయత్నం చేస్తే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని పునరుద్గాటించారు. ఇలాంటి నిరాధారమైన ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా సన్న బియ్యం పంపిణీ పట్ల ప్రజలలో మంచి స్పందన ఉందని, ప్రజలందరూ సంతోషంగా సన్నబియ్యాన్ని స్వీకరిస్తున్నారని, అయితే ఈ పథకాన్ని నీరు కార్చేందుకు కొంతమంది సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.