Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fire Accident : మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో అగ్నిప్రమాదం

— ఒక్కసారిగా చెలరేగిన మంటలు

–50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ని చెట్లు దగ్ధం

–మంటలార్పిన సిబ్బంది

Fire Accident : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ పట్టణ సమీపంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో యూనివర్సిటీ ఆవరణలోని సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాటిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో పత్తి పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదంలో హరితహారం పథకం కింద పెట్టిన చెట్లు దగ్ధమైనట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు.

ఈ ఘటనలో దాదాపు రూ . 75 వేల విలువ గల చెట్లు దగ్ధమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.కాగా సాయంత్రం 6 గంటలకు అంటుకున్న మంటలు రాత్రి 9 గంటల వరకు చెలరేగాయి. మంటల కారణంతో రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్తాఫ్ హుస్సేన్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించారు.