–అన్ని నియోజకవర్గాలలో ఇరిగేషన్ పనులు వేగవంతం
-ఈ సంవత్సరం బడ్జెట్ లో 23 వేల కోట్ల ఇరిగేషన్ కు కేటాయింపు
— వేసవి కాలంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్నిటికీ మరమ్మతులు
–ప్రతి సీఈ కింద లక్స్కర్ల నియామకం
–సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక మార్పు
–రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి
–ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్లపై 150 కోట్లు ఖర్చు పెట్టేలా నిర్ణయం
–ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Nalgonda Development :ప్రజాదీవెన నల్గొండ బ్యూరో :ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో ఇరిగేషన్ పనులను వేగవంతం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, పౌరసరఫరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు కు సాగునీరు అందించిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలను ఇరిగేషన్ కు కేటాయించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు 1100 మంది ఇంజనీర్లను కేటాయించి నీటిపారుదల శాఖ బలపడేలా ముందుకెళ్తున్నామని చెప్పారు. పూడిక కారణంగా నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయిన అన్ని ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపడుతున్నామని, ప్రత్యేకించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడికతీత పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎస్ ఎల్ బి సి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయిలో చర్చించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీ సూచనల మేరకు పనులను ముందుకు తీసుకెళ్తామని, త్వరలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం డిండి ప్రాజెక్టును చాలా కాలం నిర్లక్ష్యానికి గురి చేసిందని, అలాంటిది తాము ఆధికారంలోకి రాగానే 1800 కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లు పిలిచి పనుల మెదలు పెట్టామన్నారు. అలాగే గంధమళ్ళ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని ముందుకు తీసుకు వెళ్ళేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం కాలేశ్వరం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి కట్టినప్పటికీ అది కూలిపోయిందని, కాలేశ్వరం పై పెట్టిన ఖర్చు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సరిపోఏదని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ ఎండాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్నిటికీ మరమ్మతులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇరిగేషన్ శాఖలో లస్కర్ల కొరతను తీర్చేందుకుగాను ప్రతి సీఈ కింద 50 నుండి 100 మంది లక్స్కర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిపై నియమించుకునేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం జరిగిందని, మొత్తం 1800 పోస్టులను 33 జిల్లాలకు కేటాయించామని తెలిపారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఆర్ అండ్ ఆర్ భూ సేకరణను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని మంత్రి ఆదేశించారు. పౌరసరఫరాలపై సమీక్షిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా, నిలిచిందని గత సీజన్ లో 66 లక్షల 70000 ఎకరాలలో 153.5 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా, ఈ రబీ సీజన్లో 55 లక్షల ఎకరాలలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి మొత్తం 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మిగిలిపోయిందని అన్నారు. దీంతో పాటు సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, యాసాంగి ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక మార్పు అని, 80 నుండి 84 శాతం జనాభా కు ఉచితంగా ప్రతి మనిషికి ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఇస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ వ్యాపారానికి ఉపయోగపడేదని, జనాలు తినడానికి ఉపయోగపడలేదని దీనిపై సన్న బియ్యం పై 13 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ…
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బ్రాహ్మణ వెల్యంలో వంటి కాలువలను సైతం పూర్తి చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి చేపట్టడం జరిగిందని, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.
తనకు అత్యంత బాగా నచ్చిన పథకాలలో సన్న బియ్యం పథకం ఒకటని, ఇది పూర్తిగా పేదవాడి పథకం అని, పేదవాడు అన్నం తిని చల్లగా ఉన్నప్పుడే పేద ప్రజల సంక్షేమాన్ని చూసిన ప్రభుత్వంగా ప్రభుత్వం పేరు గడిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం కాలేశ్వరం పైన రెండు లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యధికంగా 1700 కోట్లు కేటాయించడం జరిగిందనితెలిపారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్లపై 150 కోట్లు ఖర్చు పెట్టేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి జూలైలో రహదారుల నిర్మించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌకధర దుకాణాల పోస్టులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని, 15 రోజుల పాటు సన్నబియ్యం అమ్మేలా చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రికి ఆయన సూచించారు.
శాసనమండలి చైర్మన్ మాట్లాడుతూ…
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వహణ కోసం నిధులు కేటాయించాలని, ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, శివన్నగూడెం కింద కిస్టాపురం వరకు కాలువలను పొడగించినట్లయితే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సాగునీరు అందుతుందని, ఎస్ఎల్బీసీ లైనింగ్ కు 442 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, అయితే రానున్న కాలంలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తయితే, ఉదయ సముద్రం కింద ఆయకట్టు పెరగడం వల్ల మొత్తం సుమారు మూడు లక్షలకు పైగా ఆయకట్టు పెరగనున్న దృష్ట్యా కాలువ లైనింగ్ తో పాటు, కాలువలను వెడల్పు చేయాలని, తర్వాత లైనింగ్ పూర్తి చేయాలని సూచించారు. పౌరసరఫరాలలో భాగంగా ఆంధ్ర నుండి వస్తున్న ధాన్యాన్ని నియంత్రించాలని, ముఖ్యంగా ఖమ్మం నుండి ధాన్యం ఎక్కువగా వస్తున్నదని, అక్కడి నుండి ధాన్యం రాకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడే ఆస్కారం ఉందని అన్నారు.
భువనగిరి ఎంపీ…
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంధ మల్ల ప్రాజెక్టు కింద భూసేకరణ పెండింగ్లో ఉందని, భూములు కోల్పోయిన రైతుల కు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పిల్లయిపల్లి ,ధర్మారెడ్డి కాల్వల పనులను వేగవంతం చేయాలని కోరారు. లస్కర్ల కొరతను తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లాయిపల్లి, బుణ్యాధిగాని కాలువ తదితర కాలువల కింద నిర్వహణకు నిధులు కేటాయించాలని కోరారు. శాలిగౌరారం ప్రాజెక్టు షట్టర్లు పనిచేయడం లేదని, గుర్రపు డెక్క ఎక్కువగా ఉందని వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలువల కింద భూ సేకరణ పనులు వేగవంతం చేసేందుకు 500 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.
పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు కింద కిస్టాపురం వరకు కాల్వను పొడగించాలని, మునుగోడు నియోజకవర్గంలో 148 గొలుసు కట్టు చెరువులు నిర్వహణ లేకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయాయని, వీటికి మరమ్మతులకు బడ్జెట్ కేటాయించాలని, మునుగోడు ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమని ,అందువల్ల ఇరిగేషన్ విషయంలో ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చింతపల్లి, కిష్టం పల్లి కింద భూసేకరణను కొనసాగుతున్నదని, నక్కలగండి రిజర్వాయర్ సెంటర్లు పూర్తి చేయాలని, పెళ్లి పాకాల రిజర్వాయర్ నిధులు ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంజూరు చేయించాలని, ఫోగిళ్ల, కొంకలపల్లి, అంబా భవాని ,ఏకెబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించి పనులు పూర్తిచేసేలా చూడాలని కోరారు.అదేవిధంగా పౌరసరఫరాల శాఖ పై జరిగిన చర్చ సందర్భంగా దేవరకొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు ఇదివరకే నిర్దేశించిన ధాన్యం కేటాయింపు లక్ష్యం పూర్తయినందున ధాన్యం కేటాయింపును పెంచి ప్రస్తుత రబీలో వస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ధాన్యం కొనుగోలులో తన నియోజకవర్గంలో ఎక్కడ తాలూ, తరుగు పేరుతో ధాన్యాన్ని తీయడం లేదని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతులకు నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ కి సంబంధించి బునియాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువలకు 500 కోట్లు ఇవ్వడం సంతోషమని, అయితే కాల్వపనులను త్వరగా మొదలుపెట్టి పూర్తిచేయాలని , కాలువలకు సంబంధించి భూసేకరణ త్వరితగతిని పూర్తిచేయాలని, బస్వాపురం ప్రాజెక్టు భూసేకరణకు పెండింగ్లో ఉన్న నిధులు వెంటనే మంజూరు చేయాలని, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఆపరేషన్ ఓటీలను క్లియర్ చేయాలని కోరారు.
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్ టు కు సంబంధించిన అనుమతులు వెంటనే ఇప్పించాలని, నిడమనూరు చెరువును నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింది ఎత్తిపోతలను గురించి ఆలోచించాలని , జంగిల్ క్లియరెన్స్ కు సంబంధించి పెండింగ్లో ఉన్న
కోటి 20 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలని, డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే ఈ రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని, శివన్న గూడెం రిజర్వాయర్ నుండి నారాయణపూర్ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని, ఉదయ సముద్రం కింద కృష్ణంపల్లి వరకు కాలువను పొడిగించాలని, మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల కాలంలో ఫార్మ కంపెనీలు వస్తున్నాయని ,దీనివల్ల భూమి సారం కోల్పోతుందని, అందువల్ల వీటిని నిలువ నిలువరించాలని, ధాన్యం సేకరణలో భాగంగా అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు ఎక్కువగా ఏర్పాటు చేయాలని, తాలూ,తరుగు వంటివి తీయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
మరో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ దున్నపోతుల గండి భూసేకరణను పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్ పౌరసరఫరాల శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ మరియు సమాచార పౌరసమందల శాఖ ఇన్చార్జి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్ అండ్ ఆర్ కు సంబంధించిన సమస్యలపై సమాధానాలు ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా లో పెండింగ్ ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇతర సమస్యలకు సంబంధించి వివరణలు ఇచ్చారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి వందన సమర్పణ చేయగా, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లు శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవోలు తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.