–ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ
–జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు
— హైడ్రా విషయంలో ఒత్తిళ్లను పట్టించుకోం ఎంతటివారినైనా వదలం
— ఆస్పత్రుల్లో భోజనానికి హరే కృష్ణ సంస్థ సహకారం తీసుకుంటాం
— హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకు స్థాపన మహోత్సవంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
Hare Krishna Heritage Tower: ప్రజా దీవెన, హైదరాబాద్: జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా (HYDRA) ద్వారా చెరువుల పరిరక్షణ (Conservation of ponds)ను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
భగవద్గీత (Bhagavad Gita) స్పూర్తిగా శ్రీకృష్ణుడే (Lord Krishna) మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షణగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.శతాబ్దాల కిందటే హైదరాబాద్ (Hyderabad)ను చెరువుల నగరం (లేక్ సిటీ)గా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మందికి దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌస్ లు కట్టి వ్యర్ధజలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్ధమే అవుతుంది. అందుకే చెరువుల పరిరక్షణకు పూనుకున్నాం. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఇది రాజకీయ కక్షల కోసం కానేకాదు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం.
హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా పట్టించుకోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటివారైనా భరతం పడతాం. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మితం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనాని (Hare Krishna Heritage Tower)కి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు.
అనంతశేష స్థాపన పూజలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), పలువురు ప్రజాప్రతి నిధులు, హరే కృష్ణ ఉద్యమ నిర్వా హకులు, భక్తులు పాల్గొన్నారు. కాంక్రీట్ జంగల్ గా మారిన కోకాపేట ప్రాంతంలో హరే కృష్ణ హెరిటేజ్ భవనం ద్వారా యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ఇలాంటి మహోత్తమ కార్యక్రమంలో పాల్గొనడం జన్మసుకృతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ ఆస్పత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.