Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా

–రాష్ర్ట ఎంపీ లు పార్లమెంట్ లో ఏమి చేస్తున్నారు
–నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే తెలివి కూడా లేదా
–మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

Harish Rao:ప్రజాదీవెన, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు (Congress and BJP) చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే.. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao). నేడు పార్లమెంటు‎లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం రేవంత్.. రాహుల్ గాంధీతో పార్లమెంటులో మాట్లాడించాలన్నారు. అలాగే ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు. పార్లమెంటులో పోడియం దగ్గరకు వెళ్లి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. గతంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే కేంద్రమంత్రులతో భేటీలు అన్న సీఎం రేవంత్ ఇపుడు ఏం చెబుతారని నిలదీశారు.

ఇదే సందర్భంగా తెలంగాణలో ప్రారంభమైన బడ్జెట్ (budget) సమావేశాలపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలికి ప్రతిపక్ష నేతగా మధుసూధనచారిని ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. బీఆర్ఎస్పీఎల్పీ సమావేశంలో కేసీఆర్ తమకు అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారన్నారు. ఫీజు రీ ఎంబర్స్‎మెంట్ బకాయిల చెల్లింపుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)హాయంలో మిగిలిపోయిన ఫీజు రీఎంబర్స్‎మెంట్ బకాయిలు తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామన్నారు. ఇది కాంగ్రెస్ పాలనా రాహిత్యం అని విమర్శించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో జాప్యంపై శాసనసభలో నిలదీస్తామని చెప్పారు. రైతు భరోసా నిధుల పంపిణీలో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామని వివరించారు. పార్టీ అధినేత ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు.

ఈ సందర్భంగానే మేడిగడ్డ పర్యటనపై (Medigadda Tour)కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేడి గడ్డ పర్యటన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‎ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల (BRS MLAs, MLCs)బృందం పాల్గొంటుందని తెలిపారు. జూలై 26 న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్‎ను ఈ బృందం సందర్శిస్తుందని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా వరద నీరు అధికంగా ప్రవహిస్తోందని చెప్పారు. అలా లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృధాగా పోతున్నా.. ఈ ప్రభుత్వం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం లేదు ఎందుకని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.