–‘గృహజ్యోతి’ పై భానుడి ఎఫెక్ట్
–పెరిగిన విద్యుత్ వినియోగం
–పరిమితి దాటుతున్న యూనిట్లు
— నల్గొండ జిల్లాలో పది వేల మంది పథకానికి దూరం
Gruha Jyothi Scheme: నల్గొండ పట్టణంలోని బృందావన కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్వక్తి గృహ జ్యోతి పథకం కింద లబ్దిదారుడిగా ఉన్నాడు. ఆయన ఇంట్లో ఫ్రిజ్, కూలర్, రెండు ఫ్యాన్లు, టీవీ, లైట్లు ఉన్నాయి. కొంత కాలంగా జీరో బిల్లు వస్తుండగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కూలర్ వినియోగం పెరిగింది. దీంతో మీటర్ రీడింగ్ 208 యూనిట్లుగా నమోదవడం తో పథకానికి దూరమయ్యాడు. ఫలితంగా రూ. వెయ్యికి పైగా బిల్లు వచ్చిందని చెబుతున్నాడు. గతంలో 150 యూనిట్లు దాటపోయేదని అంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడంతో చాలామంది ఈ పథకానికి దూరమవుతున్నారు.
ప్రజాదీవెన నల్గొండ బ్యూరో:
పేదలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న గృహజ్యోతిపై భానుడి ప్రభావం పడింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు విద్యుత్ వినియోగం పెరిగి మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. పరిమితికి మించి విని యోగం అవుతుండడంతో పలువురు గృహజ్యోతి లబ్ధికి దూరమయ్యారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తుండగా, వేలాది మంది అంతకు మించి వినియోగించడంతో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారికి అదనపు భారంగా మారుతుంది. మార్చి నుంచి ఎండల ప్రభావం ఉండడంతో వినియోగదారులు ఈ పథకం నుంచి ఒక్కొక్కరు దూరమవుతూ బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
— భానుడి ప్రభావం..
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరగగా, మార్చిలోనే 35 డిగ్రీల మార్కు దాటింది. ఏప్రిల్, మే నెలల్లో 40 నుంచి 45 డిగ్రీలవరకు పెరిగాయి. దీంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఫ్రిజ్ ల వినియోగం పెరిగింది. ఫలితంగా విద్యుత్ మీటర్ రీడింగ్ 200 యూనిట్లు దాటుతోంది. అలాగే పిల్లలకు వేసవి సెలవులు ఉండడంతో టీవీలకే అతుక్కుపోతున్నారు. ఈ ప్రభావం కూడా గృహ జ్యోతిపై పడినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, బల్బులు, ఫ్యాన్లు ఉంటే సాధారణంగా 100 నుంచి 150 వరకు యూనిట్లు అవుతుంది. మార్చి నుంచి ఈ వినియోగం పెరిగింది. 150 నుంచి 200 లకు పెరగగా, ఏప్రిల్, మే నెలలో 200లకు పైగా రీడింగ్ నమోదవుతుంది. జిల్లాలో రెండు నెలలుగా వేలాది మంది వినియోగదారులు ఈ పథకానికి దూరమయ్యారు. 200 యూనిట్లు దాటిన వారికి వెయ్యికి పైగా బిల్లులు వస్తున్నాయని చెబుతున్నారు.
–జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించిన కనెక్షన్లు…
కేటగిరి 1 గృహాలకు సంబంధించి 491650 కనెక్షన్లు ఉన్నాయి.
కేటగిరి 2 లో కమర్షియల్ కు సంబంధించి 71548
కేటగిరి 3 లో పరిశ్రమలకు సంబంధించి 4556
కేటగిరి 4 కు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలు 2227
కేటగిరి 5 వ్యవసాయనికి సంబంధించి 236179
కేటగిరి 6 కు సంబంధించి 9869
కేటగిరి 7 కు సంబంధించి 2667 కనెక్షన్లు ఉన్నాయి.
–కేటగిరీల వారిగా యూనిట్ ధర…
ఈ కేటగిరీలో యూనిట్ ధర సాధార ణంగా 1 నుంచి 50 యూనిట్ల వరకు రూ.1.95, 51 నుంచి 100 వరకు రూ.3.10, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.80, 200 యూనిట్లు దాటితే రూ.5.10, 201 నుండి 300 వరకు రూ. 770, 301 నుండి 400 రూ. 9.00, 401 నుండి 800 వరకు రూ. 9.50, 800 యూనిట్ల పైన 10.00 చొప్పున బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 200 యూనిట్లు దాటిన వారికి రూ. వెయ్యికి పైగా బిల్లులు వస్తున్నాయి.
–10 వేల మందికి చేకూరని లబ్ది…
వివిధ కేటగిరీలకు సంబంధించి నల్గొండ జిల్లాలో మొత్తం కనెక్షన్లు 818687 ఉన్నాయి. వీటిలో కేటగిరి 1కు సంబంధించి గృహ వినియోగం పరిధిలోకి వస్తుంది. ఇందులో 491650 కనెక్షన్లు ఉండగా, గృహజ్యోతికి సంబంధించి 238000 కనెక్షన్ లు ఉండగా 228907 మందికి ఇది వరకు వర్తించింది. ఏప్రిల్ నెలలో 200 యూనిట్లలోపు వినియోగించిన 218907 మందికి మాత్రమే పథకం వర్తించింది. ఆపై యూనిట్లు పెరిగిన సుమారు పదివేలకు పైగా వినియోగదారులు ఈ పథకానికి దూరమయ్యారు. అయితే జనవరిలో 224507 మందికి పథకం వర్తించి 4400 మంది దూరమయ్యారు. అదేవిధంగా ఫిబ్రవరిలో 224307 మంది లబ్ధిపొంది 4200 దూరమయ్యారు. మార్చిలో 224907 మందికి లబ్ధిపొంది 4 వేల మంది పథకానికి దూరమయ్యారు. ఏప్రిల్ లో 218907 మందికి వర్తించింది. 10 వేల మంది దూరమయ్యారు.
మే నెలలో కూడా 10 వేలకు పైగా మంది లబ్ధిదారులు గృహజ్యోతికి దూరమయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎండల తీవ్రత కారణంగా నల్గొండ జిల్లాలో 10 వేల మందికి పైగా లబ్దిదారులకు ఏప్రిల్ నెలలో ఈ పథకం వర్తించకుండా పోయింది. నిర్దేశిత యూనిట్లు దాటిన వారికి నెలకు రూ. వెయ్యి నుంచి రూ.1300 వరకు బిల్లు వస్తుంది. ఈలెక్కన దాదాపు లక్షల రూపాయల బిల్లులు వినియోగదారులు చెల్లించాల్సి ఉంది.
–200 యూనిట్లు దాటితే వర్తించదు..
వెంకటేశ్వర్లు (విద్యుత్ శాఖ ఎస్ఈ, నల్గొండ )
200 యూనిట్లు దాటిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడంతో యూనిట్లు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 228907 మందికి గృహజ్యోతి పథకం వర్తించగా, ఏప్రిల్ నెలకు సంబందించి 218907 మంది వినియోగదారులకు మాత్రమే వర్తించింది.