–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Special Needs Children : ప్రజాదీవెన నల్గొండ : భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరినీ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రంలో చేర్పించాలని, భవిత కేంద్రాల ద్వారా వీరికి కృత్యాధార పద్ధతులలో విద్యను అందించడం జరుగుతుందని, అంతేకాక వారి మానసిక పరమైన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు తదుపరి విడతలో విద్యాశాఖ ద్వారా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో భవిత కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడం పట్ల మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఈఓ బిక్షపతి ,స్థానిక విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు ఉన్నారు.