–ప్రగతిశీల సంఘం పేరెంట్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనయ్య
President Akula Srinaya :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ప్రగతిశీల సంఘం పేరెంట్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనయ్య డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల్లో అవకతవకలు జరుగుతున్నాయని అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతూ మంగళవారం ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం, గానుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీలే ఇందిరమ్మ ఇండ్ల అభివృద్ధి కమిటీలుగా మారాయని ఆరోపించారు. అనర్హులకు మంజూరి అయిన ఇందిరమ్మ ఇండ్లను రద్దు పరిచి అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తామని ఇచ్చిన వాగ్దానం మేరకు పక్కా గృహాలు మంజూరి చేస్తుండగా కాంగ్రెస్ కమిటీలే ఇందిరమ్మ ఇండ్ల మంజూరి కమిటీలుగా చలామణి అవుతూ నిజమైన అర్హులను ఇందిరమ్మ గృహాల లబ్దిదారులుగా గుర్తించటం లేదు అన్నారు.
నాంపల్లి మండలం, గానుగుపల్లి గ్రామంలో పక్కా గృహాలు ఉన్న వారిని, ఎకరాల కొద్ది వ్యవసాయం భూములు ఉన్న వారిని, తనకు నచ్చిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. ప్రగతిశీల సంఘం పేరెంట్ కమిటీ ( పి పి ఎల్ ) విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ట్రాక్టర్లు, కార్లు, ఏకరాల కొద్ది పట్టా భూములు, ఇతర వ్యాపారాలు ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరి అయ్యాయని, గుంట భూమి లేని గుడిసెలో నివాసం ఉంటున్న వారి పేరు మాత్రం లిస్టులో రాలేదని మండిపడ్డారు.ఇండ్ల మంజూరుకు అర్హులైన వారు, సొంత గూడు లేక కిరాయి ఇండ్లలో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారిని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేయకపోవడం విచారకరమన్నారు. మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీల ద్వారా కాకుండా అధికారులతో పూర్తి సమాచారం తెప్పించుకొని అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.