బాలికపై అఘాయిత్యం
— ఓ కీచకుడి చేతిలో అత్యాచారం
— జగద్గిరిగుట్ట లో జరిగిన ఘటన
ప్రజా దీవెన/జగద్గిరిగుట్ట: సమాజంలో ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆడిపిల్లలపై కామాంధులు కన్నేసి వాళ్ళ బతుకులను చిధిమేస్తున్నారు. ప్రతీరోజు ఎక్కడో అక్కడ కామాంధుల ఆకృత్యాలకు అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో చిన్నారి పట్ల ఓ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు. 13ఏళ్ల మైనర్పై కన్నేసిన సంజీవ్ కుమార్ (35) అనే వ్యక్తి అదును చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక నోట్లో బట్ట పెట్టి రెండు రోజులుగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా మెడపై కత్తి పెట్టి ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.