–పలువురు జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందజేత
Nationwide General Strike :ప్రజాదీవెన నల్గొండ :మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయ పరిపాలన అధికారికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూపరిండెంట్ కు సమ్మె నోటీస్ లు అందజేశారు.కార్మిక వర్గ హక్కులపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మే 20న 10 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.
77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని అన్నారు. ఈ ప్రైవేటీకరణతో సామాజిక న్యాయం దెబ్బతింటుందని రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ధరలు అవకాశాన్ని అంటుతుంటే మళ్లీ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 11ఏళ్ల బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల మధ్యన కుల మతాల పేరుతో విభజన సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతుందని అన్నారు.మోడీ విధానాలపై కార్మిక వర్గం ప్రతిఘటనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె అని అన్నారు.145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఈ దేశభక్తియుత సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, ఇరిగి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.