–సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు
May 20 Nationwide Strike :ప్రజాదీవెన ,నల్గొండ :కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గత వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.కార్మిక వాడల్లో, పని ప్రదేశాల్లో కరపత్రం, జీప్ జాతాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ
కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, అవుట రవీందర్, కెవిపిఎస్ జిల్లా నాయకులు బొల్లు రవీందర్, డివైఎఫ్ఐ నాయకులు వి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.