–సీఎం రేవంత్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Anirudh Reddy: ప్రజా దీవెన, జడ్చర్ల: జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) కి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) విజ్ఞప్తి చేశారు. ఆదివారం సీఎంను కలిసిన అనిరుధ్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడారు. బాలానగర్ ను మున్సిపాలిటీగా మార్చాలని కూడా కోరారు. అలాగే నవాబ్ పేట్ (Nawabpet) మండలంలోని కొల్లూరు గ్రామాన్ని మరియు జడ్చర్ల మండలంలోని జడ్చర్ల రూరల్ నీ మండల్ గా ఏర్పాటు చేయాలని కోరారు.
సీఎంను కలిసిన అనిరుధ్ ముఖ్యంగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ (Revenue Division) కావడానికి అన్ని అర్హతలు జడ్చర్లకు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల జడ్చర్ల (Jadcharla) ప్రాంతంలో భూ సమస్యలు పరిష్కరించడానికి, వందల కోట్ల విలువైన గైరాన్, భూదాన్ ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో వస్తున్న సాగు నీటి ప్రాజెక్టులను గురించి ప్రస్తావించారు.
జడ్చర్లకు రైలు, రోడ్డు వసతులు ఉన్నాయని, 44 వ నంబర్, 167 వ నంబర్ జాతీయ రహదారులు (National Highway) జడ్చర్ల మీదుగానే వెళ్తున్నాయని, స్థానిక స్థానికేతరులు జనాభా 4.5 లక్షల వరకూ ఉందని తెలిపారు. ఈ విషయంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్లు, మండలాలను గురించి ఒక అధికారిక కమిటీ వేస్తామని, ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం ఈ విషయంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.
అదే విధంగా జాతీయ రహదారిపై ఉన్న బాలానగర్ (Bala Nagar) ను మున్సిపాలిటీగా మార్చాలని కూడా సీఎంను అనిరుధ్ రెడ్డి కోరారు. దీనివల్ల బాలానగర్ తో పాటుగా దాని చుట్టూ ఉండే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం లోని బాలానగర్, నందారం, గుండేడ్, పెద్దాయపల్లి, గౌతాపుర్ గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ విషయం పై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ వ్యవహారాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారని తెలిపారు.