Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Jaiveer Reddy : భూ భారతి చట్టంపై గ్రామాలలో అవగాహన సదస్సులు

–ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

MLA Jaiveer Reddy :  ప్రజాదీవెన నల్గొండ :భూ భారతి చట్టంపై అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి కోరారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం అయన నల్గొండ జిల్లా, నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్ వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడమే కాకుండా, గ్రామస్తుల మధ్య భూములకు సంబంధించిన గెట్ల పంచాయతీలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. ఎలాంటి నియమ, నిబంధన లేకుండా ధరణి అవినీతి అక్రమాలకు అవకాశం ఇచ్చిందన్నారు.

 

భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారని తెలిపారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ధరణిని నిలిపివేసి కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఏడాదిన్నర కాలంలో మేధావులు, అడ్వకేట్లు, ప్రజాప్రతినిధులు అందరితో సమాలోచనచేసి, చర్చించి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టంలో ఎన్నో సవరణలు చేసి చివరికి చట్టాన్ని తేవడం జరిగిందని, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ సవరణలు చేస్తామని తెలిపారు. ధరణిలో ఎదుర్కొన్న సమస్యలన్నింటిని పరిష్కరించే భూ భారతి వంటి మంచి చట్టం పై ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాము ఈ అవగాహన సదస్సులలో పాల్గొంటామన్నారు.


జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది భూ భారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి గ్రామానికి వెళ్లి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం అవగాహనలో భాగంగా ఇప్పటివరకు 30 మండలాలలో అవగాహన కార్యక్రమాలను పూర్తి చేసామని చెప్పారు. త్వరలోనే ప్రతి గ్రామానికి గ్రామ పాలన అధికారి వస్తారని వారు అవినీతికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత తహసిల్దార్ పై ఉందన్నారు. అలాగే నిడమనూరు మండలంలో సర్వేయర్ల కొరత ఉందని, దీనిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూ భారతి చట్టం లోని 8,13,16 విభాగాల ప్రకారం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుందని తెలిపారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, తహసిల్దార్ కృష్ణయ్య భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అంజయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ,మండల అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.