–రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
Narayana Reddy: ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను (Revenue and Engineering Officers) ఆదేశించారు.మంగళవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ ,ఇరిగేషన్,ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ఎక్కడా పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం వాటిని పూర్తి చేయాలని, మొదటి ప్రాధాన్యత తో వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా ఆగిపోయిన పనులన్నీటిని తక్షణమే మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ముఖ్యంగా ఆర్డీవోలది ముఖ్యపాత్ర అని అన్నారు .పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని ప్రారంభించి ముందుకెళ్లాల్సిందిగా ఆయన కోరారు.
పనులు ఆషామాషీగా కాకుండా, ఫలితం లభించే విధంగా చేయాలని అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా (Sand smuggling),ఒండ్రు మట్టి వంటివి ఆపాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులతో పాటు, ఇరిగేషన్ అధికారులపై సైతం ఉందని అన్నారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఆస్తులను ఆక్రమించినట్లయితే వాటిని తొలగించడమే కాకుండా, పోలీసులకు సమాచారం అందించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి చెరువులను కాపాడుకునే బాధ్యత ఇరిగేషన్ శాఖ పై ఉందని, ఇందుకు రెవెన్యూ పోలీస్ సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇసుక విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అనుమతించిన వారు మాత్రమే ఇసుకను సరఫరా చేయాలని ,ఎట్టి పరిస్థితులలో ఇసుక అక్రమ రవాణా జరగడానికి వీలులేదని, ఈ విషయంలో నల్గొండ టీం (Nalgonda team)చురుకుగా పని చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిపై ఉందని తెలిపారు.అంతకుముందు రెవె న్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, పనులవారీగా భూసేకరణ , ఆర్ అండ్ ఆర్ పనులపై సమీక్షించారు. ఈ సమావేశానికి నల్గొండ ఆర్డిఓ రవి, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ,స్పెషల్ డిప్యూటీ శ్రీదేవి, తహసిల్దారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.