–మెడికల్ ఆఫీసర్లకు సమ్మే నోటీసు
Nationwide Strike :ప్రజా దీవెన నల్గొండ :కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని కనీస వేతనం 26,000 నిర్ణయించాలని కోరుతూ మే 20న ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఆశాలు పాల్గొంటారని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని పానగల్లు, మాన్యం చల్క, లైన్ వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు అందజేయడం జరిగింది.
స్వాతంత్రానికి ముందు తర్వాత కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం పారితోషికాల పేరుతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆశలకు పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వచ్చే అతి తక్కువ పారితోషకాలు సరిపోక కుటుంబ పోషణ భారమై ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేటికీ ప్రసూతి సెలవు కూడా లేవంటే కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను ఎంత మోసం చేస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విధుల నిర్వహణలో రక్షణ లేకపోవడం వల్ల ఆశా వర్కర్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ప్రమాదాల్లో మరణించిన ఎలాంటి నష్టపరిహారం లేక కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఆశాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, పానగల్లు లైన్ వాడ మన్యం చెల్క అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా కార్యకర్తలు చింత వజ్రమ్మ, ఎర్ర సౌజన్య, సువర్ణ ఎడవల్లి ప్రేమలత, రేణుక, జ్యోతి, సబిత ,వీరభద్రమ్మ, శోభారాణి రాజేశ్వరి, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.