Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hostel Wardens Andhra Pradesh : వసతి గృహాలకు కొత్త వార్డెన్లు

“ఇకనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా”..?

–ఇంతకాలం ఇంచార్జిలతో కొనసాగిన హాస్టల్లు

–అవస్థల తో సావాసం చేసిన విద్యార్థులు

— పూర్తిస్థాయి పర్యవేక్షణ అవసరం

— విద్యావేత్తలు, విద్యార్థి సంఘ నాయకులు

Hostel Wardens Andhra Pradesh : ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు వార్డెన్ల కొరతతో సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఒక్కొక్కరికీ రెండు, మూడు వసతి గృహాల బాధ్యతలు ఉండటంతో సరైన నిర్వహణ లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇకపై ఈ అవస్థలు తీరనున్నాయి. ఇటీవల ప్రభుత్వం వార్డెన్ల నియామకాలు చేపట్టింది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి నియామకపత్రాలు అందజేశారు. వారంతా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విధుల్లో చేరనున్నారు. దీంతో ఇకనైనా వసతి గృహాల నిర్వహణ సక్రమంగా జరిగి విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిద్దాం.

ఇంతకాలం ఇన్చార్జిలతోనే…

నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంక్షేమ శాఖల వసతి గృహాలను పరిశీలించినట్లయితే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి మొత్తం 59 వసతి గృహాలు ఉండగా అందులో ఫ్రీ మెట్రిక్ 44, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు 15 ఉన్నాయి. అందులో 4606 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 59 వసతిగృహాలకు ఇంతకాలం 28 మంది రెగ్యులర్ వార్డెన్ లు ఉండి మిగతా వసతి గృహాలు ఇన్చార్జిలతో కొనసాగాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం వార్డెన్లను నియమించడంతో 31 మంది వార్డెన్లు నల్లగొండ జిల్లాకు వచ్చారు. వీరితో వార్డెన్ ల ఖాళీలు భర్తీ అయినట్లు అయింది.

ఇక బీసీ వసతి గృహాల విషయానికి వస్తే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 46 ఉండగా అందులో ప్రీ మెట్రిక్ 25, పోస్ట్మెట్రిక్ 21 ఉన్నాయి. కాగా ఫ్రీ మెట్రిక్ లో 1924, పోస్ట్ మెట్రిక్ లో 2300 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ వసతి గృహాలలో 46 మందికి గాను 32 మంది రెగ్యులర్ వార్డెన్ లు ఉండగా వారికే మిగతా వసతి గృహాల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించి కొనసాగిస్తున్నారు. 14 మంది వార్డెన్లు కావలసి ఉండగా నల్లగొండ జిల్లాకు 8 మంది వార్డెన్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం రావలసి ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి నల్గొండ జిల్లా లో 27 వసతి గృహాలు ఉండగా ఇంత కాలం 7 వార్డెన్ పోస్టు లు ఖాళీగా ఉండగా అవి పూర్తిస్థాయిలో భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు.

సమస్యలు పరిష్కారమయ్యేనా..?

నల్లగొండ జిల్లాలో ఇంతకాలం పూర్తిస్థాయిలో వార్డెన్లు లేకపోవడం వల్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టి, బిసి వసతిగృహాలు ఇన్చార్జి పాలనలో కొనసాగాయి. దీంతో వసతి గృహాల పరిశీలన నామమాత్రంగా కొనసాగింది. సరైన పరిశుభ్రత ఉండేది కాదు. మెనూ అమలులో ఫిర్యాదులు వచ్చేవి. భవనాల కప్పులు పెచ్చులూడుతున్నా, మరుగుదొడ్లు, స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఒక్కో వసతి గృహానికి ఒక్కో వార్డెన్ రావడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యార్థులు భావిస్తున్నారు.

భవనాలు లేక అవస్థలు…

నల్గొండ జిల్లాలోని అన్ని వసతి గృహాలకు పక్కా భవనాల అవసరం ఉంది. జిల్లాలోని వసతి గృహాలాన్ని సమస్యల వలయంలోనే కొనసాగుతున్నాయి. కొన్ని వసతి గృహాలు సొంతభవనాలలో ఉన్న చాలా వరకు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పూర్తిగా సౌకర్యాల లేమి తో కొనసాగుతున్నాయి. విద్యార్థులు అవస్థల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు.
భోజనం, నిద్ర, చదువు అందులోనే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లకు నీటి వసతి లేక అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని వసతి గృహాలలోని గదులు పెచ్చులూడుతున్నాయి. కిటికీలకు తలుపులు లేవు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం నిధులు అందించాలని అధికారులు కోరుతున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో 59 వసతి గృహాలు ఉండగా అందులో అద్దె భవనాలు 23 ఉన్నాయి. వీటిలో పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు సంబంధించి గత డిసెంబర్ 2023 నుండి సుమారు 18 లక్షలకు పైగా అద్దెను చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో 17 నెలలుగా అద్దె బకాయిలు అలాగే ఉన్నాయి. బీసీ వసతి గృహాలకు సంబంధించి సుమారు రెండు సంవత్సరాలకు గాను 2.88 కోట్ల రూపాయల అద్దెలు చెల్లించాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి మొత్తం 27 వసతి గృహాలు ఉండగా అందులో 8 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. వాటికి కూడా గత రెండు సంవత్సరాల నుండి సుమారు 18 లక్షలకు పైగా అద్దె పెండింగ్ లో ఉంది.