–వ్యవసాయ మార్కెట్ గోదాములలో ధాన్యం ఉంచేందుకు అనుమతి ఇవండి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi :ప్రజాదీవెన, నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సవ్యంగా సాగుతున్నదని, ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డికి తెలిపారు.
రబీ ధాన్యం సేకరణ పై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల, ఆహార శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన ధాన్యం సేకరణ, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలను అడిగిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమాధానం ఇస్తూ దాన్యం సేకరణలో ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే ఆన్ రోడ్ చేసుకునే విధంగా ప్రతి మిల్లుకు రెండు వందల శాతం కేటాయింపులు చేయడం జరిగిందని వివరించారు.అయితే మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నప్పటికీ, వ్యవసాయ మార్కెట్ గోదాములలో ధాన్యం ఉంచేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని, అందువల్ల దేవరకొండ సమీపంలో ఉన్న మూడు వ్యవసాయ మార్కెట్ గోదాములలో ధాన్యం ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. ఈ సీజన్లో రాబోయే రోజుల్లో రబీ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. జిల్లాలో వివిధ కారణాలతో సకాలంలో ధాన్యాన్ని అన్లోడ్ చేసుకొని ఏడు మిల్లులను గుర్తించడం జరిగిందని, అందులో నాలుగు మిల్లులు సరైన సామర్థ్యం లేనివి గా గుర్తించామని, తక్కిన మూడింటికి అదనపు కేటాయింపులు ఇచ్చి ధాన్యాన్నీ సేకరిస్తున్నామని చెప్పారు. అలాగే లారీల సమస్యను అధిగమించేందుకు పోలీస్, ట్రాన్స్పోర్ట్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని, జాతీయ రహదారిపై పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్య లేకుండా చూస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ…
అంతకుముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న, ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటని తెలిపారు. రానున్న 15, 20 రోజులు జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల, సంబంధిత శాఖల అధికారులందరూ ధాన్యం సేకరణకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని స్థాయిలోనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది 15 రోజులు కష్టపడి పని చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రతి రైతు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రైతు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని, ఆకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని దాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వీలైతే మద్యంతర గోదాములలో సైతం దాన్యాన్ని ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దాన్యం సేకరణ పై వివిధ వార్తా పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు తక్షణమే వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. వర్షం వచ్చేందుకు అవకాశం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలనుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించడాన్ని వేగవంతం చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే టాబ్ ఎంట్రీ చేస్తే వెంటనే మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సూర్యాపేట నుండి నల్గొండ జిల్లాకు సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంతమంది మిల్లర్లు వివిధ కారణాలతో హెచ్ ఎన్ పి, ఆర్ ఎన్ ఆర్, 1638 రకాల ధాన్యాన్ని నూకలు ఎక్కువగా అవుతున్నాయన్న సాకుతో సకాలంలో మిల్లుల వద్ద ధాన్యాన్ని దించుకోవడంలేదని, అలాగే క్వింటాలకు ఐదారు కేజీల తరుగు తీస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నదని, మిల్లర్లు ఎట్టి పరిస్థితులలో తరుగు తీయవద్దని ఆయన ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో మే 15 వరకు అత్యంత ముఖ్యమైన కాలమని, ఈ సమయం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలన్నారు. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తాగునీరు, ఓ ఆర్ ఎస్ పాకెట్లు ఉంచాలన్నారు.
ఇన్చార్జి రెవెన్యూ ఆదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, ,
జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి ఫత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.