Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు

–రైతుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

–తహసిల్దారు తన ఫోన్ నెంబర్ ను సెంటర్ ఇన్చార్జి కి ఇవ్వాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Tripathi :ప్రజాదీవెన, నల్గొండ :ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీలలో మిల్లులకు తరలించే సమయంలో రైతులు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షం వల్ల ధాన్యం తడిచిపోకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, శాపల్లి శివారులో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ లారీల సమస్య వల్ల ధాన్యం తరలించకపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షం వల్ల దాన్యం తడిచిందని తెలుసుకొని జిల్లా కలెక్టర్ ఈ కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి లారీలు ఈ వారంలో ఎప్పుడు వచ్చాయని ?ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ నెల రెండు, ఐదో తేదీలలో లారీలు వచ్చాయని నిర్వాహకులు తెలుపగా, కాగా ఈనెల 2 న, తిరిగి 5 న కేంద్రం నుండి లారీలు ధాన్యాన్ని తరలించగా ఆ వివరాలు రికార్డులో పొందుపరచకపోవడంపై ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తక్కువ లారీలు వస్తున్నాయని, లారీల సంఖ్య పెంచాలని రైతులు కోరగా బుధవారం నుండి ప్రతి రోజు రెండు లారీలు కేంద్రం నుండి ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. రైతులు ప్రతి బస్తాకు నాలుగు రూపాయలు చొప్పున లారీలో తరలించే ముందు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఆలా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. తహసిల్దారు తన ఫోన్ నెంబర్ ను సెంటర్ ఇన్చార్జి కి ఇవ్వాలని, ఏవైనా సమస్యలు వస్తే రైతులు, నిర్వాహకులు తహసిల్దార్ కు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన దాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీలకు పంపించాలని, మొత్తం కుప్పలన్నీ ఒకేసారి పంపించాలన్న ఉద్దేశంతో ఆగకుండా, ఒక లారీలో ఎంతవరకు ధాన్యం పంపడానికి అవకాశం ఉంటే అంతవరకు పంపించాలని, తక్కిన ధాన్యాన్ని తర్వాత లారీలో పంపించాలని చెప్పారు. రికార్డులు సరిగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.
జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్, తహసిల్దార్ వెంకటేశ్వర్ రావ్, తదితరులు ఉన్నారు.