–విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Regular Inspection : ప్రజాదీవెన నల్గొండ : మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు, హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలల్లో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు
నిల్వ ఉంటే జెసిబి ని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ
పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు వారి మండలంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ముళ్ళ పొదలు, చెత్తాచెదారం లేకుండా చూడాలని, విద్యార్థులు విష పురుగులు,క్రిమి కీటకాల
బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ,మూసీ పరీవాహక ప్రాంతంలో విష పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు వృధాగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తించి వాటివల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా కూలగోట్టాలని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ 2025 గోడపత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛ సర్వేక్షన్ పై జిల్లాలోని ప్రజలు అందరికీ అవగాహన కల్పించాలని,
స్వచ్ఛత వైపు ప్రతి ఒక్కరూ పయనించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తదితర అన్ని అంశాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు.
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. కాగా ఈ సోమవారం ప్రజావాణిలో మొత్తం 129 దరఖాస్తులు రాగా, అందులో జిల్లా అధికారులకు 57, రెవెన్యూ శాఖకు సంబంధించి 72 దరఖాస్తులు వచ్చాయి. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,
డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాస రావు, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి,
జిల్లా అధికారులు, ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.