–పథకం అమలుకు ముడిపెట్టిన సర్కారు
–క్షేత్రస్థాయిలో తప్పని తిప్పలు
–కుటుంబంలో ఒక్కరికే అవకాశం
–మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్
–జనాభా నిష్పత్తి ప్రకారం యూనిట్లు
— దరఖాస్తుకు గడువు పొడిగింపు
–నిబంధనల సడలింపు.. తప్పని తిప్పలు
Rajiv Yuva Vikasam : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఊరించి ఉసూరుమనిపిస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హులని సర్కారు షరతులు విధించడమే అందుకు కారణం. మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేయడంతో పాటు, ఆపై సదరు జిల్లా మంత్రి ఆమోదం పొందితేనే రుణాలు మంజూరయ్యేలా నిబంధనలు రూపొందించింది.ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించి, జూన్ 2లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్ధిక సాయం అందిస్తామని సర్కారు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే. అయితే దరఖాస్తు గడువును మాత్రం మరో మారు పొడిగిస్తూ ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. రేషన్ కార్డులు లేని చాలా కుటుంబాలు ఇటీవల అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో యువతకు తిప్పలు తప్పటం లేదు.
పథకం మార్గదర్శకాలు ఇవే…
–మండలం, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూ ఎస్ జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా వర్గాలకు యూనిట్ల మంజూరు.
–గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం మించకూడదు.
— రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ లేనట్లయితే ఆదాయం సర్టిఫికెట్ ఉండాలి.
–వ్యవసాయేతర యూనిట్లకు సంబంధించి 21-55 ఏండ్లవారు అర్హులు. వ్యవసాయ సంబంధిత యూనిట్లకు 60 ఏండ్లు మించకూడదు..
–కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం, ఐదేండ్లు దాటితేనే మరొకరికి ఛాన్స్.
–లోన్ కోసం బ్యాంక్ కాన్సెంట్ పత్రం ఉండాలి.
–మొదటి దరఖాస్తుదారులకు తొలి ప్రాధాన్యం, మొత్తం మంజూరైన యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయిస్తారు. అందులోనూ ఒంటరి, వితంతు మహిళలకు ప్రాధాన్యం.
–దివ్యాంగులకు 5 శాతం. తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ వర్గీకరణ అమర వీరుల కుటుంబాలకు ప్రాధాన్యం.
ఇప్పటికే స్వయం ఉపాధి పొందుతున్నవారికి కావాల్సిన పత్రాలు…
—ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయం, కులధ్రువీకరణ పత్రం, రవాణారంగం అయితే డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ రంగమైతే పట్టాదారు పాస్బుక్, దివ్యాం గులకు సదరం సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, మండలస్థాయి కమిటీ జారీ చేసే సర్టిఫికెట్.
–దరఖాస్తు విధానం..
లబ్ధిదారుల ఎంపిక ఆన్లైన్లో ఓబీఎంఎంఎస్ (ఆనైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ కాపీ కి సంబందిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు (ఎంపీడీవో), మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తులను తొలుత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి, బ్యాంకు మేనేజర్, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డిఆర్డిఎ ప్రతినిధులతో ఏర్పాటైన మండల కమిటీ పరిశీలిస్తుంది. అర్హుల జాబితాను సిద్దం చేసి జిల్లా స్థాయి కమిటీకి పంపుతుంది. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ లబ్దిదారులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్, డీఆర్టీఏ పీడీ కన్వీనర్, అడిషనల్ కలెక్టర్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జీఎం. కార్పొరేషన్ల ఈడీలు, మైనార్డ్, డిసెబుల్డ్, ఉమెన్ వెల్ఫేర్ ఏడీ లు, పీడీలు, జిల్లా ట్రైబర్ వెల్ఫేర్ ఆఫీసర్, లీడ్ బ్యాంకులకు సంబంధించిన జిల్లా మేనేజర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా లక్ష్యానికి అనుగుణంగా ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం లబ్దిదారుల జాబితా రూపొందిస్తారు. చివరికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం లబ్దిదారులకు రుణాలు మంజూరు చేస్తారు. 100 శాతం సబ్సిడీ రుణాలను నేరుగా లబ్దిదారులకు అందజేస్తారు. అయితే యూనిట్ ఏర్పాటుకు తొలుత 80శాతం నిధులే విడుదల చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మిగతా 20 శాతం మంజూరు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత నేరుగా ఆయా ఏజెన్సీలకు నిధులను బ్యాంకు విడుదల చేస్తుంది. అవసరమైతే రుణాలను పొందినవారికి ఆయా రంగాల్లో 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. యూనిట్ల గ్రౌండింగ్ పూర్తిచేసిన అనంతరం యూటిలిటీ సర్టిఫికెట్లను (యూసీ) అధికారులు ప్రభుత్వానికి సమర్పించాలి.
— రేషన్ కార్డు ఎలా.?
ఈ పథకాన్ని సర్కారు రేషన్ కార్డు తో
ముడిపెట్టింది. రేషన్ కార్డు లేకుంటే ఆదాయం సర్టిఫికెట్ ను పెట్టాలని సూచించింది. అయితే ఆదాయ సర్టిఫికెట్ జారీకి రెవెన్యూ అధికారులు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే బీసీ బంధు, మైనార్టీ బందు, ట్రై కార్, తదితర కార్పొరేషన్ల రుణాల కోసం ఆయా వర్గాలకు చెందినవారు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఆన్లైన్ లో ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయగానే, ఇప్పటికే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. మరోవై పుసర్కారు ఆదరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారో, లేదో స్పష్టత నివ్వలేదు. అయితే ప్రభుత్వం నిబంధనలో కొంత సడలింపు చేసింది. ఆదాయ సర్టిఫికెట్ లేకున్నా ఏప్రిల్ 14 వరకు రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే రేషన్ కార్డు లేని వారి పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మారింది.
తొమ్మిది రోజుల గడువు పొడిగింపు…
రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. జిల్లాలోని నిరుద్యోగ ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, ఓబిసి, ఈబీసీ యువత రాజీవ్ యువ వికాస్ పథకానికి మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారీలు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,అధికారులతో రాజీవ్ యువ వికాసం పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించి వివరాలను వెల్లడించారు.
22356 దరఖాస్తులు…
రాజీవ్ యువ వికాసం అమలలో భాగంగా నల్గొండ జిల్లాలో దరఖాస్తుల పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఉప ముఖ్యమంత్రి కి వివరిస్తూ రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు 22,356 దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ ల నుండి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకించి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించేందుకుగాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎంకు వివరించారు.
అన్ని గ్రామాలు, మండల, మున్సిపల్ కేంద్రాలలో విస్తృత ప్రచారం కల్పిస్తామని, అలాగే టామ్ టామ్ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సందేహాల నివృత్తికి గాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు నల్గొండ జిల్లాలో ఎస్సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.