–చెప్పింది చేసి చూపిస్తున్నoదుకు అవసరమైన నిధులు రూ. 30 వేల కోట్లు
–ఎన్నికల హామీ మేరకు లక్ష మాఫీ కి సమకూర్చింది రూ. 6వేల కోట్లు
–రెండు, మూడు విడతల మాఫీ ఇంకా కావాల్సింది రూ. 24వేల కోట్లు
–కొనసాగుతోన్న సీఎం రేవంత్ రెడ్డి మార్కు మాయాజాలం
–నిధుల కోసం నిద్రాహారాలు మాని నింగి స్ధాయిలో విశ్వ ప్రయత్నాలు
–అదే ధీమాతో డెడ్ లైన్ పెట్టుకొని మరీ రుణమాఫీ ప్రకటన చేశారు
–మొత్తంగా రూ. 30వేల కోట్ల సమీ కరణకు సమాయత్తమవుతున్న రేవంత్ ప్రభుత్వం
Revanth Reddy:ప్రజాదీవెన, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బ్యాంకుల వద్ద అప్పు తీసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. రెండు లక్షల రుణమాఫీ (Loan waiver)చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఊరూరా తిరిగి చెప్పారు. తాము చత్తీస్ ఘడ్లో చేసి చూపించామన్నారు. నిజానికి ఈ రెండు లక్షల రుణమాఫీ హామీని 2018లో కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కానీ అప్పుడు జనం నమ్మలేదు. ఇప్పుడు నమ్మారు. ఓట్లు వేశారు. అయినా రుణమాఫీ అసాధ్యమని బీఆర్ఎస్ వాదిస్తూ వచ్చింది. తాము లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయామని ఆర్థిక పరిస్థితి (Financial situation) కఠినంగా ఉందని చెప్పుకొచ్చింది. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు కూడా సవాల్ చేశారు ఆ ధైర్యంతోనే. కానీ రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టుకుని మరీ రుణమాఫీ చేయబోతున్నానని ప్రకటించారు. రూ. 31వేల కోట్లు ఇందుకు అవసరం అవుతాయని ప్రకటించి.. ఆ మేరకు చెప్పిన సమయానికి నెల ముందే రూ. లక్ష రుణమాఫీని పూర్తి చేశారు. ఇందు కోసం రూ. ఆరు వేల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. నెలాఖరుకు లక్షన్నర, ఆ తర్వాత రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేస్తారు. మరో ఇరవై నాలుగు కోట్లు సమీకరించామన్న దైర్యం రేవంత్ లో కనిపిస్తోంది. ఇంత నగదు ఎలా సమీకరించారు అన్నదే అసలు ఆర్థిక వేత్తలకు కూడా సస్పెన్స్ గా మారింది. కానీ నిధులెక్కడ నుంచి వస్తే ఏంటి తాము రుణమాఫీ అమలు చేశామా లేదా అన్నదే ముఖ్యమన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)గోప్యత పాటిస్తోంది.
ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన పథకాలు – నిధుల మిగులు ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారం చేపట్టగానే ఖాళీ ఖజానా ఎదురొచ్చింది. రైతు బంధు పథకానికి బటన్ నొక్కుతామని హడావుడి చేశారు కానీ రేవంత్ (revanth) సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ సొమ్ము కూడా లేదు. చివరికి అతి కష్టం మీద రైతు బంధు అమలు చేశారు. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) వచ్చాయి. దాంతో అన్ని పథకాలకు బ్రేక్ పడింది. దాదాపుగా మూడు నెలల పాటు పథకాలకు.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపేశారు. కేవలం జీతభత్యాలు, పాత అప్పులకు కిస్తీలు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. ఈ కారణంగా ఖజానాలో మిగులు కనిపిస్తూ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం.. ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఆదాయం కూడా పెరిగింది. ఈ నిధులతో రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే గురువారం చేసిన రుణమాఫీ కోసం.. ప్రభుత్వం అప్పులేమీ చేయలేదు !
ఇంకా రూ. 24 వేల కోట్లు అవసరం..
గురువారం పూర్తి చేసిన రుణమాఫీతో (loan waiver) కాకుండా ఇంకా రూ. 24వేల కోట్లు అవసరం. నెలాఖరులో లక్షన్నర… ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. అంటే.. మరో నెల రోజుల్లోనే రూ. 24 వేల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. దీనికి తగ్గ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ఆర్బీఐ నుంచి ప్రతి మంగళవారం తీసుకునే వెసులుబాటు ఉన్న రుణాలతో పాటు.. భూములను తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందు కోసం అంతర్గతంగా ప్రక్రియ జరిగిపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
400 ఎకరాల తాకట్టుకు సన్నాహాలు ?
తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govtఉన్న అత్యంత విలువైన ఆదాయ వనరు భూములు. ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఖరీదైన భూములు ఉన్నాయి. వాటిలో అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కోకా పేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 20వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిని తాకట్టు పెట్టేందుకు ఓ మర్చంట్ బ్యాంక్ కోసం టెండర్ ప్రకటన కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరానికి గరిష్టంగా 50 కోట్లు చొప్పున 400 ఎకరాల విలువను 20వేల కోట్లుగా నిర్ణయించారు. కనీసం పదివేల కోట్లు అయిన రుణం అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా భూములు తాకట్టు పెట్టడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినా.. ప్రభుత్వం స్పందించలేదు. తాము భూములు తాకట్టు పెట్టడం లేదని చెప్పలేదు.
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజి మరికొన్ని నిధులు
ఇంత భారీ మొత్తంలో నిధులు ఎలా సేకరిస్తున్నారన్నదానిపై వస్తున్న అనేక సందేహాలకు.. పూర్తిగా కాకపోయినా.. తమ ముందున్న మార్గాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే సంక్షేమ పథకాలకు (welfare schemes) మూలధన సేకరణలో సెబీ రూపొందించిన సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజి విధానాన్ని వినియోగించుకుంటామని ప్రకటించారు. నిధుల సమీకరణకు సెబీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి బడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తామని అంటున్నారు. దీనిపై ఆయన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. ఎక్విప్ దేశీ అనే పెట్టుబడుల సేకరణ సంస్థ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన ఆర్థిక బాధ్యత, నిర్వహణ పరిమితులకు లోబడి ఫండ్ సేకరణ జరపడానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ అత్యవసరమని శ్రీధర్ బాబు చెబుతున్నారు.
అసలు సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటి ?
వ్యాపార సంస్థలు (Business organizations)భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్కి వెళ్లొచ్చు. 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన వచ్చంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేందుకు సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. తాము కూడా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి.. లాభాపేక్ష లేకుండా తమ వద్ద పెట్టుబడులు పెట్టాలని ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. దీని ద్వారా పదిహేను వేల కోట్ల వరకూ సమీకరించాలని అనుకుంటోంది. ఇలా విభిన్న మార్గాలను అంచనా వేసుకుని ఖచ్చితంగా నిధులు సమకూరుతాయనే లెక్కలతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఈ కొత్త విధానాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు కొత్త దారి చూపిస్తాయని అనుకోవచ్చు.