–రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి
–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
–ఎస్పీ శరత్ చంద్ర పవర్
–పోలీస్ అధికారులకు ప్రశంస పత్రాలు అందజేత
Road Safety : ప్రజాదీవెన నల్గొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అలాగే రోడ్లపై సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల విలువైన ప్రాణాలు పోతున్నట్లు చెప్పారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించిన పోలీస్ శాఖ సూచనల మేరకు ఆయా ప్రదేశాల లో ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారులు, ఆర్అండ్ బి శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఉద్యోగ ధర్మం తో పాటు,సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదల నివారణకు కృషి చేయాలన్నారు.పంచాయతీ రోడ్ల పై మరమ్మతుల ను గ్రామ పంచాయతీల ద్వారా చేయిస్తామని తెలిపారు.
ఆర్అండ్ బి రహాదారుల పై ప్రమాదాలు జరగకుండా ప్రస్తుతం చేస్తున్న పనులు కొనసాగించాలన్నారు.పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు ఫలితంగా జిల్లాలో బ్లాక్ స్పాట్ లు 60 నుండి 40 కి తగ్గాయన్నారు.ఇందుకు పోలీస్ అధికారులను ఆమె అభినందించారు. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. మిషన్ ఆధార్ పేరున రహదారుల దగ్గరలో ఉన్న గ్రామాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ అవగాహన సమావేశాలకు సంబంధిత శాఖలందరూ హాజరుకావాలని కోరారు.
జిల్లాలో అధికారులందరు టీమ్ వర్క్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు.మర్రిగూడ బై పాస్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు పనుల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నదని, ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని, అందువల్ల పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లు, పోలీసు అధికారులు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేసిన పోలీస్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల సంస్థ అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రశంస పత్రాలను అందజేశారు.