–గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన
–ఉపాధి హామీ పథకం పనుల తనిఖీ
Saplings for Farmers :ప్రజాదీవెన, నల్గొండ:ఉపాధి హామీ పథకం కింద పెంచుతున్న నర్సరీల ద్వారా రైతులకు, ఇంటి యజమానులకు ఇచ్చే మొక్కలు వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం గిట్టుబాటు అయ్యేవిధంగా పనులు చేపట్టాలని అన్నారు. నల్గొండ జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆమె నల్గొండ జిల్లాలోని చిట్యాల, నార్కెట్ పల్లి మండలాలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులతో పాటు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన పనులను తనిఖీ చేశారు. ముందుగా చిట్యాల మండలం పెదకాపర్తి లో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంయుక్తంగా తనిఖీ చేశారు. పెద్ద కాపర్తి గుట్టమీద కందకం తవ్వే పనులను చేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి రోజు వేతనం ఎంత వస్తున్నదని అడిగారు. గత సంవత్సరం కంటే .
ఈ సంవత్సరం రోజువారీ వేతనం అధికంగానే వస్తున్నదని, ప్రతిరోజు 250 రూపాయలు పైగానే వస్తున్నదని కూలీలు తెలిపారు. అనంతరం నర్సరీని తనిఖీ చేసి నర్సరీ బాగుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ నిర్వాహకులతో మాట్లాడుతూ నర్సరీలో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారని? ఇళ్లలో పెంచుకునేందుకు ఎలాంటి మొక్కలు ఇస్తున్నారని ?రైతులకు ఎలాంటి మొక్కలు ఇస్తున్నారని? అడిగి తెలుసుకున్నారు. రైతులు పంట పొలాలలో పొలం గట్ల పై వేసుకునేందుకు రైతులకు పనికొచ్చే మొక్కలు ఇవ్వాలని, ఇళ్లల్లో పెరటి మొక్కలను ఇవ్వాలని ఆమె సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఎక్కువ వేతనం వచ్చే విధంగా పనులు ఇవ్వాలని, పనులు గుర్తింపు సమయంలోనే అలాంటి పనులను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చిట్యాల ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.