–ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించడంతోపాటు, పిఎం ఏవై గ్రామీన్ ఆన్ లైన్ ఎంట్రీ వివరాల నమోదులో కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగా మర్రిగూడ ఎంపీడీవో మునయ్య కు షో కాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం మునుగోడు ఎంపీడీవో కార్యాలయంలో చండూరు డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మర్రిగూడ ఎంపీడీవో మునయ్య ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో నిర్లక్ష్యం వహించారని అంతేకాక తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేయడం లేదని తెలిపారు. అందువల్ల షో కాజ్ నోటిస్ జారీ చేసినట్లు తెలిపారు. చండూరు డివిజన్లో సోమవారం నాటికి ఇండ్ల గ్రౌండింగ్ 50 శాతం పురోగతి తీసుకురావాలని చెప్పారు.
ఇళ్లు మంజూరై కట్టుకునేందుకు ఆర్థికంగా స్తోమత లేని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఎల్ 3 నుండి ఎల్ 1 కు వచ్చే లబ్ధిదారుల జాబితా పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎట్టి పరిస్థితులలో జాబితాలో అనర్హులు రావడానికి వీలులేదని తెలిపారు. భూభారతిపై కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేసి వైద్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఓపి, మందులు స్టాక్ రిజిస్టర్ ను, ఇతర వివరాలను పరిశీలించారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఎంపీడీవో, తహసిల్దార్, ఇతర అధికారులు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.