–జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తాం
–కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే సిసిఎంబి, టిఫ్ఫా పరీక్షలకు పంపాలి
–జూన్ 12 నుండి అవగాహన కల్పించాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Reduce Infant Mortality : ప్రజాదీవెన నల్గొండ : శిశు మరణాలు తగ్గించడాన్ని వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, అనుబంధ శాఖలు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ విషయంలో అన్ని శాఖలు, వారి ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిశు మరణాలను తగ్గించేందుకు ఆస్కారమున్న ప్రతి కేసు విషయంలో మొదటి నుండి కృషి చేయాలని, ఒక శిశువుని కాపాడడం వల్ల ఒకరి జీవితాన్ని రక్షించిన వారమవుతామని అన్నారు. ఈ బాధ్యతను ఒక ఉద్యోగిగా కాకుండా, ఒక మనిషిగా ఇతరుల ప్రాణాలు రక్షించే అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావించి పని చేయాలని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ, మిర్యాలగూడ డివిజన్ల లో సంభవించిన శిశు మరణాల పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిశు మరణాలను తగ్గించేందుకు మహిళ గర్భం దాల్చినప్పటి నుండి శిశువు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం వరకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు. మొదటి కానుపుకే కాకుండా రెండు, మూడు ఎన్ని కాన్పులైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో శిశు మరణాలు సంభవించకుండా ఉండేందుకుగాను జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, ప్రత్యేకించి శిశు మరణాలు తగ్గించడంలో వైద్యాధికారులు, ఆశ అంగన్వాడీ ల బాధ్యత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు శిశు మరణాలు లేకుండా చూసుకోవాలని అన్నారు.
ఎక్కడైనా కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే ఈ కేసులను సిసిఎంబి, టిఫ్ఫా పరీక్షలకు పంపించాలని తెలిపారు. భవిత కేంద్రాల ద్వారా మానసిక వైకల్యం కలిగిన, విభిన్న సామర్ధ్యాలు కలిగిన పిల్లలకు అందించే సేవలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో సుమారు 700 మంది పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని, జన్యుపరమైన లోపాల వల్ల కొంతమంది మానసిక వికలాంగులుగా జన్మిస్తే, మరికొందరు పుట్టిన తర్వాత వైకల్యం, మానసిక వైకల్యం, ఇతర వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భవిత కేంద్రాల ద్వారా వారి మానసిక వైకల్యానికి చికిత్స అందించడంతో పాటు, వారిని అందరిలా తీర్చిదిద్దడంలో భాగంగా భవిత కేంద్రాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, జిల్లాలో ప్రతి మండలానికి ఒక భవిత కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, మానసిక వికలాంగుల వికలాంగతను దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, వారి ప్రత్యేక అవసరాలు దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. గర్భధారణ సమయంలోనే కొన్ని లోపాలు ఉంటున్నాయని, మానసిక వైకల్యంతో పుట్టిన వారి మానసిక వికాసానికి చికిత్స చేయడం ఒక ఎత్తయితే, అసలు వారు ఇలాంటి మానసిక వైకల్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత వైద్య, శిశు సంక్షేమ శాఖల పై ఉందని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థి దశ నుండి విద్యార్థినులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జూన్ 12 నుండి జిల్లా వ్యాప్తంగా ఒక షెడ్యూల్ ను స్పందించి ఈ షెడ్యూల్ ప్రకారం ఆశ, అంగన్వాడీ, సైన్సు టీచర్లు పాఠశాలల్లోని విద్యార్తినిలకు అవగాహన కల్పించాలని చెప్పారు. శుక్రవారం లోగా జాబితా తయారు చేసి సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నల్గొండ, మిర్యాలగూడ డివిజన్ల లో సంభవించిన శిశు మరణాలపై కేసుల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఏరియా ఆస్పత్రిల కో ఆర్డినేటర్ డాక్టర్ మాత్రు నాయక్, డీఈఓ, డిప్యూటీ డిఎంహెచ్ ఓ లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.