Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

State Art Gallery Lakshmi : బుద్ధ వనం వద్ద కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

–రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి

State Art Gallery Lakshmi :ప్రజాదీవెన నల్గొండ : ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు మే 12న బుద్ధవనం సందర్శిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటు,పాట్లు లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి లక్ష్మి అన్నారు.మే 12న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధవనం సందర్శిస్తున్న దృష్ట్యా ఏర్పాట్ల విషయమై శనివారం ఆమె బుద్ధవనం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కేవలం 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, ప్రత్యేకించి సివిల్ పనులు అన్నిటిని మే 3 నాటికి పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే వారందరూ బుద్ధవనం రాక సందర్భంగా ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు,ఇబ్బందుకు లేకుండా చూడాలన్నారు. అందరూ గర్వపడేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా బుద్ధవనం పరిసర ప్రాంతాలు, విజయ విహార్ రోడ్డుకిరిపక్కల లైటింగ్, పరిశుభ్రత చేయించాలని చెప్పారు.


జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున త్వరితగతన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనేవారు మన ప్రాంతానికి రావడం మన ప్రాంత అదృష్టం అని, అందువల్ల ఏర్పాట్లను పగడ్బందిగా చేయాలని ఆమె చెప్పారు .
అనంతరం మీడియా ప్రతినిధులతో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మిస్ వరల్డ్ పొటీదారులు బుద్ధవనం సందర్శనకు వస్తున్న దృష్ట్యా అధికారులతో సమీక్షించడం జరిగిందని, దాదాపుగా ఏర్పాట్లు, పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలిపోయిన కొద్దీ పాటి పనులను సైతం మే 3 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.


ప్రపంచ సుందరి పోటీదారుల తాత్కాలిక పర్యటన ప్రకారం మే 12 న మధ్యాహ్నం 1 గంటకు వారు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు బుద్ధవనం వస్తారు ,విజయ విహర్ చేరుకొని అనంతరం బుద్ధవనం సందర్శించి అక్కడ ధ్యాన మందిరం,జాతకవనం తదితరాలన్ని సందర్శించిన తర్వాత తిరిగి రాత్రి 7.45 గంటలకు బయలుదేరి హైద్రాబాద్ వెళ్లనున్నారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, బుద్ధవనం ప్రాజెక్టు ఓ ఎస్ డి సుధాన్ రెడ్డి, టూరిజం శాఖ ఎస్ ఈ భాస్కరరావు, సంబంధిత శాఖల అధికారులు,తదితరులు హాజరయ్యారు.