–గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన
Revenue for Gram Panchayats :ప్రజాదీవెన నల్గొండ :వర్మి కంపోస్టు ద్వారా గ్రామపంచాయతీలకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని చిట్యాల, నార్కెట్ పల్లి మండలాలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, గ్రామపంచాయతీల ద్వారా నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ముందుగా ఆమె నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేములలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. కాగా ఈ పల్లె ప్రకృతి వనం 3 సంవత్సరాల క్రితమే పూర్తి కావడంతో పల్లె ప్రకృతి వనం నిర్వహణ బాధ్యతలను ఉపాధి హామీ ద్వారా చేయలేకపోతున్నట్లు నిర్వాహకులు తెలపగా, పల్లె ప్రకృతి వనంలోని చెట్లకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా క్రమం తప్పకుండా నీరు అందించాలని, అదే విధంగా గ్రామపంచాయతీ ద్వారా నిర్వహణ బాధ్యతలను సైతం చూడాలని ఆమె సూచించారు. అనంతరం నార్కెట్ పల్లి లో సగ్రిగేషన్ షెడ్ ను సందర్శించి వర్మి కంపోస్ట్ తయారీని తనిఖీ చేశారు.
ఉదయం ఎన్ని గంటలకు వస్తారని? చెత్తను వేరు చేసేటప్పుడు తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేస్తున్నారని? కూలీలను అడిగి తెలుసుకున్నారు. వర్మి కంపోస్ట్ ద్వారా వచ్చిన ఎరువును గ్రామపంచాయతీ మొక్కలు, ఇతర మొక్కలకు వాడుతున్నామని తెలుపగా, గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా వర్మి కంపోస్టును తయారు చేయాలని, వచ్చిన మొత్తంలో కొంత వర్మీ కంపోస్ట్ అమ్మినట్లయితే గ్రామపంచాయతీకి ఆదాయం వస్తుందని డైరెక్టర్ చెప్పారు. మాదే ఎడవల్లిలో ఒక రైతు పొలంలో ఏర్పాటు చేసిన నీటి కుంటను డైరెక్టర్ పరిశీలించారు. తనకు రైతుకు 4 ఎకరాల భూమి ఉందని, వర్షాకాలంలో ఊట కుంటలోని నీరు పొలానికి వినియోగించడంతో పాటు, చేపలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద గడ్డపారలు సరఫరా చేయడం లేదని, అలాగే గతంలో పార కోసం ప్రతిరోజు పది రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వటం లేదని కూలీలు డైరెక్టర్ దృష్టికి తీసుకురాగా విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నార్కెట్ పల్లి ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.