–కంటెనైర్ లో చోరీ కార్ల రవాణా
–జీపీఎస్ సహాయంతో పట్టుకున్న బాధితులు
–పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు
Stolen cars : ప్రజాదీవెన, సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఓ కంటైనర్ లారీ దూసుకెళుతోంది. జాతీయ రహదారిపై ఏదో లోడుతో వెళుతున్న లారీ అనుకున్నారు అంతా.. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు కంటైనర్ లారీనీ ఛేజ్ చేస్తున్నారు. దూసుకెళుతున్న లారీని హైవేపై సింగరాయకొండ దగ్గర ఆపారు. తమ దగ్గర ఉన్న జిపిఎస్ మ్యాప్ను సరిచూసుకున్నారు. ఆ మ్యాప్లో తాము జీపియస్ అమర్చిన థార్ కారు లోకేషన్ కంటైనర్ లారీ వైపే చూపిస్తోంది. దీంతో కంటైనర్ లారీని ఓపెన్ చేయించి చూస్తే కారు అందులోనే ఉంది. తమ కారుతో పాటు మరో రెండు కార్లు కూడా ఉన్నాయి.
వీటన్నిటికి నెంబర్ ప్లేట్లు మార్చి ఉన్నట్టు గుర్తించారు. అంటే వీటిని కంటైనర్ లారీలో ఎవరి కంటా పడకుండా రహస్యంగా హైదరాబాద్ నుంచి చెన్నైకు తరలిస్తున్నారన్నారు. ఇలా కూడా కార్లు చోరీలు చేస్తున్నారా అంటూ అందరూ అవాక్కయ్యారు. ఒకవేళ తమ కారుకు జీపీయస్ లేకుంటే ఇక జన్మలో ఆ కారు దొరికేది కాదన్నమాట..హైదరాబాద్కు చెందిన జూమ్ యాప్ ద్వారా కార్ బుకింగ్ సెంటర్ నుంచి కారు కావాలని థార్ కారును బుక్ చేసుకున్న ఓ వ్యక్తి మూడు రోజులైనా తిరిగి రాలేదు.. అంతేకాకుండా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. దీంతో అనుమానం వచ్చిన జూమ్ యాప్ నిర్వాహకులు కారుకు అమర్చిన జీపీయస్ను పరిశీలించారు. జీపీయస్లో కారు చెన్నైవైపు హైవేపై వెళుతున్నట్టు చూపించింది. దీంతో అప్రమత్తమైన కారు యజమాని తన స్నేహితుల సాయంతో హైదరాబాద్నుంచి చెన్నైవైపు హడావిడిగా బయలుదేరారు. కారు ప్రకాశంజిల్లా సింగరాయకొండ దగ్గర ఉందనగా జీపీఎస్ ద్వారా పరిశీలించి చూశారు.
అయితే హైవేపై వెళుతున్నది కారు కాదు, కంటైనర్ లారీ, మరి కారు ఎక్కడుందంటూ అనుమానంతో కంటైనర్ లారీని ఆపారు. కంటైనర్ లారీతో మాట్లాడి.. డ్రైవర్తో డోర్ తెరిపించారు. అలా తెరిచి చూస్తే తాము వెతుకుతున్న థార్ కారు కనిపించింది. అయితే ఆ కారుకు నెంబర్ ప్లేట్ మార్చి ఉన్నట్టు గుర్తించారు. తమ కారుతో మరో రెండు కార్లు కూడా ఉన్నాయి. టాటా జస్ట్,రెనాల్ట్ లాడ్జ్ కారులను కూడా తమ కారు తరహాలోనే యాప్లో బుక్ చేసుకుని వాటిని కంటైనర్ లారీలో చెన్నైకు తరలిస్తున్నట్టు గుర్తించారు.