— సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
CPM Tummala Veera Reddy :ప్రజాదీవెన నల్గొండ :మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం, కార్మిక చట్టాలను, హక్కులను రక్షించడానికి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఎర్రజెండాను ఎగరవేయడం జరిగింది. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 1886లో 18 గంటలు 16 గంటలు కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకునే వాళ్ళని ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించారని అన్నారు. ఆ సమయంలో కార్మికులపై పోలీసు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంలో తడిసిన బట్టలే ఎర్రజెండాగా ఎగురవేశారు. 1890 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. 1823లో మద్రాసు పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలు మొట్టమొదటిసారిగా మేడేను నిర్వహించారని, ఆ అమరవీరులు పోరాడి సాధించిన ఎనిమిది గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురి అవుతుందని బిజెపి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు, విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ నల్ల చట్టాలు తేచ్చిందని గుర్తు చేశారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు అనేక సంక్షేమ పథకాలు అన్ని రద్దు చేస్తూ కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలంగా చట్టాలు తెచ్చిందని దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో పాసిస్ట్ పార్టీ బిజెపి అధికారంలో ఉందని అది మతోన్మాదం పెంచి పోషిస్తున్నదని అధికారం కోసం మత ఉన్మాదం రెచ్చగొడుతుందని, భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తేవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. గతంలో ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పట్టుదలతో చేపట్టిన సార్వత్రిక సమ్మె లక్షలాది మందితో కార్మిక, కర్షక, మజ్దూర్, కిసాన్, సంఘర్ష ర్యాలీ తో బలమైన ఉద్యమాన్ని నిర్మించామని, ఇదే మాదిరిగా 2025 మే 20న దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు కార్మిక కర్షక సంఘాలు నిర్వహించే గ్రామీణ బందును జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతామని పాలకులు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనిచో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం, ప్రజల ముందున్న పెద్ద సవాల్ అని బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సిహెచ్. లక్ష్మీనారాయణ, సయ్యద్ హషo, పాలడుగు ప్రభావతి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి. సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, సైదులు, రవీందర్, శంకర్, నరేష్, పరిపూర్ణ చారి,సరోజ, అరుణ తదితరులు పాల్గొన్నారు.