–లారీ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
–ధాన్యం తరలింపుకు కావలసిన లారీలను ఏర్పాటు చేయాలని సూచన
Stop the Payments :ప్రజాదీవెన నల్గొండ :రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడా లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో సరైనన్ని లారీలు లేకపోవడం వల్ల ధాన్యం తరలింపు మందకోడిగా నడుస్తున్నదని తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ లారీ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎక్కువ వాహనాలు ఏర్పాటు చేసి తక్షణమే ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. ధాన్యాన్ని తరలించేందుకు సకాలంలో ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ స్పందించనందుకు గాను లారీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే కాంట్రాక్టర్ కు చెల్లింపులు ఆపాలని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పుడు తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించడంలో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు. మిల్లర్లు సైతం వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. రైతులు సరైన తేమశాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిట్యాల లో ఉన్న ఉదయ రైస్ ఇండస్ట్రీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని, అలాగే హమాలీలు సైతం త్వరితగతిన ధాన్యాన్ని దించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ధాన్యం అన్లోడ్ చేసుకునేందుకు 7,8 లారీలు మాత్రమే ఏర్పాటు చేయగా, ఇంకా ఎక్కువ మొత్తంలో లారీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, తదితరులు ఉన్నారు.