ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నడి బొడ్డున సాగర్ రోడ్డుపై ఉన్న అనుమతి లేని, ట్రేడ్ లైసెన్స్ లేని ఫుట్ వేర్ షాపును నల్లగొండ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం ఉదయం జెసిబితో పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేశారు. సర్వే నంబర్ 992 లోని సుమారు 10 గుంటల భూమి గ్రామ కంఠందినంటూ వివాదం ఉండగా, తాను కొనుగోలు చేసిందని స్థానిక మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, భాగస్వాములు గతంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు. అయితే గ్రామ కంఠం అని నిర్ధారణ చేసిన అధికారులు మొదలు కొన్నది ఎవరనే విచారణ చేస్తున్నారు.
ఇదే స్థలంలో ఫుట్ వేర్ షాపుకు ప్వారు అద్దెకిచ్చారు. అయితే షాపు మున్సిపల్ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్స్ లేదని, షాపు రేకుల షెడ్డు నిర్మాణానికి అనుమతి లేదని అక్టోబర్ 19 నుండి ఈ నెల 18 వరకు మూడు నోటీసులను మున్సిపల్ అధికారులు ఇచ్చిన స్పందించలేదని దీంతో కూల్చి వేశామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ లో సభ్యులైన మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్, తహసీల్దార్ ఎన్.హరిబాబు, ఒన్, టూ టౌన్ పోలీసు ఇన్స్పెక్టర్లు కోట కరుణాకర్, పి.నాగార్జున, ఎస్ఐలు హరీష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ యాదగిరి, ఆర్ అండ్ బి ఎఇఇ రాంబాబు, టీపిఓ సోమయ్య, టీపిఎస్ అంజయ్యలున్నారు.
రూ.10లక్షలు నష్టపోయా…. షాప్ యజమాని రెహ్మాన్
సుమారు 5 గుంటల మేర స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని వ్యాపారం చేస్తున్నానని ఒకేసారి కూల్చేయడంతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రి ధ్వంశమైందని నిర్వాహకుడు ఎంఎ. రెహ్మాన్ వాపోయాడు. విద్యుత్ సామాగ్రి ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్స్, స్కానర్లు, చెప్పులు, బాట్లు, సాండిల్స్ ధ్వంసమయ్యాయని, జిఐ రేకులు పనికి రాకుండా పోయాయని బాధ వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల ప్రతీకార రాజకీయాలలో తాను నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. షాపు పక్కనే ఉన్న ఒక చిన్న డబ్బాను కూడా కూల్చారని బాధితుడు సతీష్ వాపోయాడు.