–తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు
Martyrs’ Dream : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం కావస్తున్నప్పటికి అమరులు ఆకాంక్షించిన స్వప్నం ఇంకా మిగిలే ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు అన్నారు.స్థానిక నల్లగొండ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యమకారులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరులను స్మరించుకుంటూ అమరులకు స్మృతి దీపం పేరిట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు పందుల సైదులు, ఇందూరి సాగర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రపంచ పటంలో తెలంగాణ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.సబ్బండ వర్గాలు సామూహికమై, నిర్భందాలకు ఎదురీది సీమాంధ్ర పెత్తనాన్ని ధిక్కరించి, వంధలాది అమరుల త్యాగాలు చేస్తే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని, అన్నారు.అమరులు ఆకాంక్షించిన ఉద్యమ ఆకాంక్షలకు నడుస్తున్న పాలనకు ఏమాత్రం పొంతనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ట్యాగ్ లైన్ అయినా నీళ్లు నిధులు నియామకాల గురించి పాలనా విధానాలలో స్థానమే లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్య పౌర హక్కులు కాపాడబడతాయని కలలుగన్న ఉద్యమకారుల హక్కులను పాలకలు నిరంతరయంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారన్నారు. పుష్కర కాలంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందే తప్ప అభివృద్ధి ఆమడ దూరం కూడా జరగలేదని ఇది తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణకు విరుద్ధమన్నారు. తెలంగాణ సంపదమొత్తం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించుకొని పాలిస్తున్నారని ఇది నిరంకుశ విధానాలకు నిదర్శనం అన్నారు. ఫ్యూచర్ సిటీ, స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఆర్ పేరు మీద హైదరాబాద్ చుట్టు మాత్రమే చర్చ చేస్తున్నారు తప్ప గ్రామీణ ప్రాంతాలను వాటి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
సంక్షేమ పథకాలు పడకేసినాయని, అభివృద్ధి పేరుతో జపం చేస్తున్నారని, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లినాయని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మొత్తంగా తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని కలలుగన్న తెలంగాణ ప్రజల ఆశలపై పాలకులు నిప్పులు చల్లుతున్నారని వారన్నారు.నాటి పాలకులైనా, నేటి పాలకులైన సీమాంధ్ర పెత్తందారీ విధానాలనే కొనసాగిస్తున్నారు.ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం.కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను,తెలంగాణకు రావాలిసిన న్యాయమైన కృష్ణా నది జలాలను నేటికి పరిష్కరించకపోవడం తెలంగాణ పట్ల బిజెపికి ఉన్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యాన్ని రగిలించి ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ లోని పౌర సమాజం పై ప్రజాస్వామ్యవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజాసంఘాల నాయకులు కే.పర్వతాలు, చీర పంకజ్ యాదవ్, పన్నాల గోపాల్ రెడ్డి, బోనగిరి దేవేందర్, బకరం శ్రీనివాస్, ఇందూరి సాగర్, అయితగోని జనార్దన్ గౌడ్, ఆర్ విజయ్ కుమార్, గూడూరు జానకిరామ్ రెడ్డి, బెల్లంకొండ హరికృష్ణ, తోట నరసింహ్మచారి, రుద్రాక్షి దుర్గయ్య, ఏడుకొండలు ఖుర్షిద్ మియా, వెంకటేశ్వర్లు, మల్లెపాక వెంకన్న, బొజ్జా దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.