— జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ
Transport Workers : ప్రజాదీవెన నల్గొండ :తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్గొండ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు.
శనివారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ ఏవో కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మంది రవాణా రంగ కార్మికులు పనిచేస్తున్నారని వీరందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, పెన్షన్, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి తహతలాడుతుందని విమర్శించారు.
నూతన మోటార్ వాహన చట్టం 2019 ద్వారా విపరీతమైన ఫైన్స్ వేస్తున్నారని హిట్ అండ్ రన్ తో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లనే బాధ్యులుగా చేస్తూ పెద్ద నేరాలకు వేసే శిక్షలను, పైన్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ పెట్రోల్ ధరలు స్పేర్ పార్ట్స్ సీట్ టాక్స్ రోడ్ టాక్స్ విపరీతంగా పెంచి రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభం వైపు నడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రవాణా రంగ కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు కోసం మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, జ నవీన్ తదితరులు పాల్గొన్నారు.