Tripathi : ప్రజాదీవెన, నల్గొండ :నల్గొండ జిల్లా ,నార్కెట్ పల్లి మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
గురువారం ఆమె చెరువు గట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంబర్ లో ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2 న ప్రారంభమై, ఫిబ్రవరి 9న ముగుస్తాయని, బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2 న నల్గొండ పట్టణ పురవీధుల్లో నగరోత్సవం తో ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి 4న స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 5 న స్వామి వారి శేష వాహన సేవ, ఫిబ్రవరి 6న స్వామి వారి అగ్నిగుండాలు, 7న దీపోత్సవ సేవ, శేష వాహన సేవ, 8 న మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం 9న గ్రామోత్సవం ఉంటాయని వివరించారు.శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా శాఖల వారీగా సమీక్షిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం బ్యారికేడింగ్ తో క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే అన్ని రోజులు పూర్తి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని, భక్తులు క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా నియంత్రించాలని, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇందుకు ఇన్చార్జి డిఎస్పి బి. రమేష్ స్పందిస్తూ ఈ విడత స్వామి వారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం ప్రతిరోజు మూడు విడతలుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకుగాను, 900 మంది పోలీసులు సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, ఎలాంటి పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను చెరువుగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని గ్రామాల నుండి పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని , అలాగే అవసరమైతే నార్కెట్పల్లి మండలం సిబ్బందిని విధులకు నియమించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
చెరువుగట్టు పైకి వచ్చే పంచాయతీ రోడ్లు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆదేశించారు.బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో తాగునీటిని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం చెరువుగట్టుపై 33 కె వి జనరేటర్లు రెండు ఉన్నాయని ఆలయ అధికారులు జిల్లా కలెక్టర కు తెలుపగా, సరిపోయినంత విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ బ్రహ్మోత్సవాలు నిర్వహించే రోజులలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే 33 కెవి జనరేటర్లను సైతం సిద్ధం చేసుకోవాలని విద్యుత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారితో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లి స్వామి వారిని దర్శించుకునే విధంగా టికెట్ కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.బ్రహ్మోత్సవాలలో భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకుగాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో చెరువుగట్టు వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నార్కెట్పల్లి, అక్కనపల్లి పి హెచ్ సి సిబ్బందిని చెరువుగట్టు వద్ద విదులలో నియమించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో మద్యం నియంత్రించాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు రెవెన్యూ అదనపు కలెక్టర్ ను పరివేక్షణ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే నల్గొండ ఆర్డీవో బ్రహ్మోత్సవాల ఇన్చార్జి బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ఈ సంవత్సరపు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తమ వంతు సహకారం జిల్లా యంత్రాంగానికి అందిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు తాను అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని చెప్పారు.
జిల్లా, మండల స్థాయి అధికారులు, దేవాలయ అధికారులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్, టికెట్ కౌంటర్లు, బ్యారి కేడింగ్, పోలీస్ భద్రత తదితర అన్ని అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్యంగా చెరువుగట్టు కింద ఏర్పాటు చేసే షాపులు రోడ్లపైకి రాకుండా పోలీసు అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్ కు, శాసనసభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, ఇంచార్జ్ డి.ఎస్.పి జీ. రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. భాస్కర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్, జిల్లా అధికారులు ,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.