–గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి
–యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్
Vice President Paladugu Sudhakar : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎన్నికల ఇచ్చిన కనీస వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే కార్మిక ఖాతాలో పెండింగ్ వేతనాలు వెంటనే జమ చేయాలని చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పొన్న అంజయ్య అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందర అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తాం. అర్హత కలిగిన వాళ్ళను పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయకపోగా నెలలు తరబడి వేతనాలు పెండింగ్ లో ఉంటున్నాయని విమర్శించారు.
పెరిగిన ధరలతో చాలీచాలని వేతనాలతో, అవి సకాలంలో రాక గ్రామపంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు కార్మికుల ఖాతాలో కాకుండా కార్యదర్శులు డ్రా చేసి ఇస్తున్నారని దీనివల్ల వేతనాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలనలో పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని అర్హత కలిగిన వాళ్లను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో కార్మికులను వేధింపులను గురి చేస్తున్నారని వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న ఎంపీడీవో ఆఫీసుల ముందు,16న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 19 తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతపాక వినోద్ కుమార్, జిల్లా నాయకులు, తిరిగి ఎల్లేష్, గండమల్ల ఆశీర్వాదం,పి. సర్వయ్య,ఎండి. జహీర్, కోటయ్య, కె. నరసయ్య, కె మంగారెడ్డి, పాలడుగు చంద్రయ్య, ఎర్ర అరుణ, లింగయ్య రాము నరసింహ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.