–సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ
Mahila Samakhya Attenders : ప్రజాదీవెన నల్గొండ : మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల మహిళా సమైక్య అటెండర్స్ జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళ సమైక్య లు ఏర్పడిన నాటి నుండి 20 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనేక రకాల పనులు చేస్తున్నారు.
జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీరి వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కూరెళ్ల యాదగిరి, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, గుండు సైదమ్మ, బి. మణమ్మ, పి. మణమ్మ, తదితరులు పాల్గొన్నారు.