–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
–మే డే సందర్భంగా పట్టణంలో పలు చోట్ల సిపిఎం జెండా ఆవిష్కరణలు
CPM Mudireddy Sudhakar Reddy : ప్రజాదీవెన, నల్గొండ: చికాగో నగరంలో 139 సంవత్సరాల క్రితం కార్మికులు వారి హక్కుల కోసం పని గంటల కోసం పోరాడుతున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులపై కాల్పులు జరపడం వలన వేలాది మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారుతున్న క్రమంలో కార్మికుడు తన చొక్కాను ఎర్రటి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండానే నేడు మేడే అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిపిఎం పట్టణ కార్యాలయం పై ఎర్రజెండాలు ఆవిష్కరించారు. అంతకుముందు పట్టణంలో పెద్ద బండ, డాక్టర్స్ కాలనీ, ఖాతాలగూడెం, పానగల్లు, చర్లపల్లి, ఆనంద్ నగర్ తదితర ప్రాంతాలలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శి జెండా ఆవిష్కరణలు జరిపారు. అనంతరం సిపిఎం కార్యాలయం జరిగిన సభలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చిందని అన్నారు. రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చి మాట తప్పిందని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చి కేంద్రం తన పెత్తనాన్ని కొనసాగిస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గిస్తూ నిర్వీర్యానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షించడం కోసం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గాదె నరసింహ, పాక లింగయ్య, చలివోజు సైదాచారి, భూతం అరుణ, ఆకిటి లింగమ్మ, గుండాల నరేష్, కందుల అశోక్, గంజి నాగరాజు, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, కన్ని కంటి సత్యనారాయణ, పనస చంద్రయ్య, రుద్రాక్ష యాదయ్య, కుంభం లక్ష్మమ్మ, కోట సైదులు పాల్గొన్నారు.